విడదల రజనీపై టీడీపి నుంచి లక్ష్మీ శ్యామల: ఇంతకీ ఎవరీమె?
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) సిట్టింగ్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై ఫుల్ క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో 23 నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది. వారిలో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ (YCP) కండువా కప్పుకున్నారు. మిగిలిన 19 స్థానాల్లో సిట్టింగ్ అభ్యర్థులే పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. గన్నవరం నియోజకవర్గం నుంచి యార్లగడ్డ వెంకట్రావును బరిలో దింపనున్నారు. ఇక రాజధాని ప్రాంతమైన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంపై టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన మద్దాలి గిరి వైసీపీకి మద్దతివ్వడంతో... ఆ నియోజకవర్గంలో హ్యాట్రిక్ గెలుపు దిశగా... టీడీపీ పావులు కదుపుతోంది.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ inchargeగా ఇప్పటికే మంత్రి విడదల రజినీ (Vidudala Rajani) కొనసాగుతున్నారు. దీంతో ఆమెకు ధీటుగా మహిళా అభ్యర్థిని ఎన్నికల బరిలో దింపాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. రాజకీయాలకు ఏ మాత్రం పరిచయం లేని ఓ మహిళా పారిశ్రామిక వేత్తను టీడీపీ రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. వ్యాపారంలో రాణిస్తున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త వీఆర్ శ్రీ లక్ష్మీ శ్యామల (Sri Laxmi Shyamala)ను ఈసారి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీలో దింపాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వ్యాపార రంగంలో రాణిస్తున్న శ్రీ లక్ష్మి శ్యామల... కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డెయిరీ వ్యాపారం ద్వారా పాడి రైతులకు అండగా నిలిచారు. అదే సమయంలో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలను శ్రీ లక్ష్మీ శ్యామల నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మిక భావాలతో కృష్ణ, గుంటూరు జిల్లాల్లో జీర్ణోద్దారణలో ఉన్న పలు ఆలయాలను పునర్నించారు కూడా. ఆధ్యాత్మిక రంగంలో సైతం శ్రీ లక్ష్మీ శ్యామల విశేష కృషి చేశారు. డెయిరీ వ్యాపారంలో రాణిస్తున్న శ్రీ లక్ష్మి శ్యామల... వివిధ వ్యాపారాల్లో సైతం పెట్టుబడులు పెట్టి సక్సెస్ అయ్యారు.
గతేడాది నవంబర్ నెలలో చంద్రబాబు శ్రీ పెరంబదూర్ పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో ఆయనతో పాటే శ్రీ లక్ష్మి శ్యామల సైతం రామానుజుల వారిని దర్శించుకున్నారు. సౌమ్యురాలిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ లక్ష్మి శ్యామలతో ఇప్పటికే పలు దఫాలు పార్టీ కీలక నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున మంత్రి విడుదల రజినిని ఇంఛార్జ్ గా నియమించారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరఫున మహిళను పోటీలో నిలబెడితే... గత ఎన్నికల్లో కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి ఎవరో తెలియాలంటే... పార్టీ ప్రకటన వరకు ఆగాల్సిందే.
- కాసుల ప్రతాపరెడ్డి
No comments:
Post a Comment