తాజా సర్వే: పవన్తో చంద్రబాబు జత కట్టినా జగన్కే జై
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నేతృత్వంలోని జనసేన (Jana Sena)తో పొత్తు పెట్టుకుని పోటీ చేసినా వచ్చే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో (AP Assembly Elections 2024) చంద్రబాబు (Nara Chandrababu Naidu) నాయకత్వంలోని టిడిపికి అధికారం దక్కే సూచనలు కనిపించడం లేదు. సీట్లు తగ్గినప్పటికీ వైఎస్ జగన్ (YS Jagan) నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ (YSR Congress) అధికారంలోకి వస్తుందని తాజా సర్వే ఒకటి తేల్చింది. ఎలెక్సెన్స్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రీ పోల్ సర్వే నిర్వహించింది. 2024లో జరిగే శాసనసభ ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీకి 122 శాసనసభ స్థానాలు వస్తాయని ఆ సర్వే స్పష్టం చేసింది. ఆ పార్టీకి 49.14 శాతం ఓట్లు వస్తాయని తేల్చింది.
జనసేన, టీడిపి కూటమికి 44.34 శాతం ఓట్లు వస్తాయని, బిజెపికి 0.56 శాతం ఓట్లు పోలవుతాయని, కాంగ్రెస్కు 1.21 శాతం ఓట్లు వస్తాయని, ఇతరులకు 4.75 శాతం ఓట్లు వస్తాయని ఆ సమగ్ర సర్వే తెలిపింది. 2023 డిసెంబర్ 1, 2024 జనవరి 12 తేదీల మధ్య ఎలెక్సెన్స్ (ELECSENSE) ఈ సర్వే నిర్వహించింది. 88,700 శాంపిల్ సైజుతో రాష్ట్రంలోని మొత్తం 175 స్థానాల్లో సర్వే జరిగింది. ఈ సంస్థ ప్రతినిధులు ఓటర్లను నేరుగా కలిసి వివరాలు సేకరించారు. సందేహంగా అనిపించిన 10-15 శాతం శాంపిల్స్ను పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై, శాంతిభద్రతలపై, వర్తమాన సంఘటనలపై, టిడీపి`జనసేన పొత్తు (TDP-Jana Sena Alliance)పై, ఉపాధిఉద్యోగావకాశాలపై తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రశ్నలను రూపొందించి సమాధానాలు రాబట్టారు. కులపరమైన అంశాన్ని కూడా సర్వేలో పరిగణనలోకి తీసుకున్నారు.
సర్వే ప్రకారం... వైసీపికి 122 సీట్లు, టిడిపీ-జనసేన కూటమికి 53 సీట్లు వస్తాయి. కాంగ్రెస్ (Congress), బిజెపీ (BJP)లకు ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్కు 53.7 శాతం మంది జైకొట్టారు. మహిళల్లో (Women Voters) అత్యధికులు వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. వైసిపికి అనుకూలంగా ఉన్నారు. మహిళల్లో 54.77 శాతం మంది వైసీపిని, 41.12 శాతం మంది టిడీపి, జనసేన కూటమిని, 0.32 శాతం మంది బిజెపిని, 0.66 శాతం మంది కాంగ్రెస్ను కోరుకుంటున్నారు.
పురుషుల్లో మాత్రం ఎక్కువ శాతం మంది టీడీపి, జనసేన కూటమివైపు మొగ్గుచూపారు. 49.67 శాతం మంది టీడీపీ, జనసేన కూటమికి అనుకూలంగా ఉండగా, 45.68 శాతం మంది వైసీపీ (YCP)కి అనుకూలంగా ఉన్నారు. వయస్సు రీత్యా చూస్తే 60 ఏళ్లకు పైబడినవారిలో 55.07 శాతం మంది వైసీపికి అనుకూలంగా ఉన్నారు. 45-60 ఏళ్ల మధ్య వయస్సు గలవారిలో 55 శాతం మంది, 30-45 ఏళ్ల మధ్య వయస్సుగలవారిలో 50.72 శాతం మంది, 18-30 ఏళ్ల మధ్య వయస్సుగలవారిలో 43.04 శాతం మంది వైసీపీని కోరుకుంటున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 18-30 ఏళ్ల వయస్సుగలవారిలో 53.03 మంది టీడీపీకి మద్దతు తెలుపుతున్నారు. 30-45 ఏళ్ల మధ్య వయస్సుగలవారు 45.56 శాతం మంది, 45-
60 ఏళ్ల మధ్య వయస్సుగలవారు 41.95 శాతం మంది, 60 ఏళ్లు పైబడినవారు 40.51 శాతం మంది టీడీపీకి మద్దతు పలికారు.
మొత్తం మీద, వైఎస్ జగన్ మెజారిటీ సాధించి తిరిగి అధికారంలోకి వస్తారని సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. మహిళల మద్దతులో ఆయన తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి.
-కాసుల ప్రతాపరెడ్డి
No comments:
Post a Comment