జగనన్న వదిలిన బాణం రివర్స్: వైసిపికి ఇక చిక్కులే, ఆప్పుడే ఆర్కే షిఫ్ట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (AP CM), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress) అధినేత వైఎస్ జగన్ (YS Jagan) సోదరి వైఎస్ షర్మిల (YS Sharmila కాంగ్రెస్లో చేరడం ఖాయమైంది. ఆమె ఈ రోజు (జనవరి 4వ తేదీ) ఉదయం 10.30 గంటలకు కాంగ్రెస్లో చేరుతారు. తన వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారు. ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారనున్నారనే సంకేతాలు అప్పుడే అందుతున్నాయి. మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి (Alla Ramkrishna Reddy) (ఆర్కే) కాంగ్రెస్లో చేరుతానని ప్రకటించారు. మంగళగిరి (Mangalagiri) శాసనసనభ నియోజకవర్గం టికెట్ గంజి చిరంజీవి (Chiranjeeviకి ఇవ్వాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. దీంతో అసంతృప్తికి గురైన ఆర్కే (RK) శాసనసభ సభ్యత్వానికి, వైసిపి (YCP)కి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరింత మంది కాంగ్రెస్లోకి వెళ్లే అవకాశాలున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఊపు వస్తుందని చెప్పడంలో సందేహం లేదు. అదే సమయంలో ఏపిలో రాజకీయ సమీకరణాలు మారుతాయి.
రాష్ట్ర విభజనతో (AP Bifurcation) ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. దాదాపు పదేళ్లు దాని ఆనవాళ్లు కూడా దాదాపుగా కనిపించలేదు. ఇప్పుడు వైఎస్ షర్మిల ప్రవేశంతో ప్రాణం పోసుకుంటుంది. షర్మిలను ఏపి పిసిసి అధ్యక్షురాలిగా నియమిస్తారనే ప్రచారం జరుగుతున్నది. ఆమెను పిసిసి అధ్యక్షురాలిగా నియమిస్తారా, సిడబ్ల్యుసిలోకి తీసుకుంటారా అనేది తేలాల్సి. పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపడితే ఆమె నేరుగా తన సోదరుడు వైఎస్ జగన్ను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకు ఆమె సిద్ధపడినట్లే కనిపిస్తున్నారు. నిజానికి, తన ఏపి రాజకీయాల్లోకి ప్రవేశించి తన సోదరుడికి ఇబ్బంది కలిగించకూడదని ఆమె భావించారు.
వైఎస్ జగన్ ఇబ్బంది పెట్టడం వల్లనే షర్మిల రాజకీయాల్లోకి వస్తుందని ఆమె భర్త అనిల్ కుమార్ (Anil Kumar) చెప్పినట్లు టిడిపి నేత బిటెక్ రవి (BTech Ravi) చెప్పారు. నిన్న బిటెక్ రవి, అనిల్ కుమార్ ఒకే విమానంలో విజయవాడకు ప్రయాణించారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య మాటామంతీ జరిగింది. ఆ సమయంలో అనిల్ కుమార్ తనతో చెప్పిన మాటలను బిటెక్ రవి మీడియాకు వెల్లడిరచారు. దీన్ని బట్టి షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని అర్థం చేసుకోవచ్చు.
షర్మిల నిర్ణయంపై వైఎస్ జగన్ తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు అర్థమవుతున్నది. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి (Nara Chandrababu Naidu)పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పొత్తులు పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారని ఆయన చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. దానికి చంద్రబాబు కూడా తీవ్రంగానే ప్రతిస్పందించారు. జగనన్న వదిలిన బాణం రివర్స్ అయిందని ఆయన వ్యాఖ్యానించారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ షర్మిల రాష్ట్రమంతా తిరిగారని, ఇప్పుడు రివర్స్ అయ్యారని ఆయన అన్నారు. మీ ఇంట్లో మేం చిచ్చు పెట్టడమేమిటి? అని ప్రశ్నించారు. అది మీ కుటుంబ వ్యవహారమని, మాకేమి సంబంధమని చంద్రబాబు అన్నారు. మీ చెల్లి, మీ తల్లి... మీరు చూసుకోవాలని ఆయన జగన్కు సూచించారు.
షర్మిల ఏపి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తే అది కచ్చితంగా జగన్కు ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆమె మాట్లాడే ప్రతి మాటకు ప్రతిస్పందన ఉంటుంది. షర్మిలను తిప్పికొట్టడం జగన్కు ఇబ్బందికరంగానే ఉంటుంది. వైసిపి నేతలు షర్మిలపై విమర్శలు చేయడానికి ఆసక్తి చూపకపోవచ్చు. దానివల్ల టిడిపి, జనసేన కూటమి లాభపడుతుందని కూడా చెప్పవచ్చు. ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓటునే చీల్చవచ్చు. షర్మిలను జగన్ ఏ విధంగా ఎదుర్కుంటారనే చూడాల్సిందే.
- కాసుల ప్రతాపరెడ్డి
No comments:
Post a Comment