కేసీఆర్ ఓటమిని ప్రస్తావించిన వైఎస్ షర్మిల: జగన్కు పరోక్ష హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ పిసీసీ (AP PCC) అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల (YS Sharmila) తన ఎజెండాను ప్రకటించారు. అదే సమయంలో తెలంగాణలో కేసీఆర్ (KCR) నాయకత్వంలోని బీఆర్ఎస్ (BRS) ఓటమిని ప్రస్తావించారు. దాన్ని బట్టి ఆమె తన సోదరుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan)కు పరోక్ష హెచ్చరిక చేశారు. తెలంగాణలో ఒక నియంతను అధికారం నుంచి దించానని ఆమె అన్నారు. రాజశేఖర రెడ్డి (YS Rajasekhar Reddy) బిడ్డ తెలంగాణలో ఒక నియంతను అధికారం నుంచి దింపిందని షర్మిల అన్నారు. దీన్ని బట్టి ఏపిలో కూడా వైఎస్ జగన్ను అధికారం నుంచి దింపుతానని ఆమె హెచ్చరిక చేసినట్లయింది. తాను స్వార్థం చూసుకోలేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ తన పుట్టిల్లు అని, తెలంగదాణ మెట్టిన ఇల్లు అని ఆమె చెబుకున్నారు.
తెలుగు ప్రజలు బాగుండాలి కాబట్టే తాను కాంగ్రెస్ (Congress)లో చేరినట్లు ఆమె తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనకు ముఖ్యమని కూడా ఆమె అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోకసభ స్థానాలకు పోటీ చేస్తుందని ప్రకటించారు, తాను ఈ నెల 23 నుంచి జిల్లాల్లో పర్యటిస్తానని, తొమ్మిది రోజుల పాటు రోజుకు మూడు జిల్లాల్లో చేరికలు ఉంటాయని చెప్పారు. 24 నుంచి పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు.
బిజెపి (BJP)పై ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మణిపూర్ (Manipur) సంఘటనను ప్రస్తావిస్తూ అటువంటి బిజెపి దేశానికి అవసరం లేదని చెప్పారు. పోలవరం (Polavaram), అమరావతి రాజధాని (Amaravati Capital), విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha steel plant) లాంటి అన్ని విషయాల్లో బిజెపి ఏపికి అన్యాయం చేసిందని ఆమె విమర్శించారు. వైసిపి, టిడిపి రెండు కూడా బిజెపితో కుమ్మక్కు అయ్యాయని ఆమె అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 25 మంది ఎంపీలు కూడా బిజేపి వాళ్లేనని ఆమె వ్యాఖ్యానించారు.
తాను ఎవరూ వదిలిన బాణం కాదని, మహిళ కదా అని తక్కువ చేసి మాట్లాడవద్దని షర్మిల అన్నారు.తన వల్ల ఏ పార్టీకి నష్టం జరుగుతుందో ప్రజలే చెబుతారని ఆమె అన్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వస్తే నియంతలే అవుతారని ఆమె అన్నారు. ఎవరికి ఎక్కువ భయం ఉంటే వారే తనను విమర్శిస్తారని వైఎస్ షర్మిల అన్నారు.
- కాసుల ప్రతాపరెడ్డి
No comments:
Post a Comment