దూకుడు పెంచిన కాంగ్రెస్: ఎన్నికల సమరానికి అస్త్రాలు ఇవే...
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల (AP Assembly Elections 2024)తో పాటు లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ దూకుడు పెంచింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ (Andhra Ratna Bhavan)లో పల్లంరాజు అధ్యక్షతన 11 మంది సభ్యులతో కూడిన కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ సమావేశమైంది. మిగతా పార్టీల కన్నా ముందుగానే మ్యానిఫెస్టోను విడుదల చేయాలని పిసిసి (AP PCC) భావిస్తున్నది. ప్రత్యేక హోదా (Speciala Category Status), విభజన హామీలు, సిపిఎస్ (CPS) రద్దు, విశాఖ ఉక్కు కర్మాగారం (Visakha steel plant) ప్రైవేటీకరణ నిలిపివేత వంటి అస్త్రాలను సంధించి ఎన్నికలను ఎదుర్కోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. వాటితో పాటు కొన్ని సంక్షేమ పథకాలను కూడా మ్యానిఫెస్టోలో చేర్చే విషయంపై కసరత్తు సాగుతున్నది.
కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో మాదిరిగా ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్లే అవకాశాలున్నాయి. నిరుద్యోగులు, విద్యార్తులు, కార్మిక సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ఎపిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కలిసి మ్యానిఫెస్టోలో పెట్టాల్సిన అంశాలపై వినతులు చేశారు.
కమిటీ నివేదికను షర్మిల (YS Sharmila) పరిశీలించిన తర్వాత మార్పులు, చేర్పులు చేస్తారు. ఆ తర్వాత నివేదికను ఎఐసిసి (AICC)కి సమర్పిస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగానే మ్యానిఫెస్టోకు తుదిరూపు ఇవ్వడానికి కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్లో బహిరంగ సభను ఏర్పాటు చేసి రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేత మ్యానిఫెస్టోను విడుదల చేయించి, హామీలను ఇప్పించే అవకాశాలున్నాయి.
ప్రజల అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే మ్యానిఫెస్టోను రూపొందిస్తున్నామని పల్లంరాజు (Pallam Raju) చెప్పారు. జాతీయ స్థాయిలో మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం (P. Chidambaram) అధ్యక్షతన మ్యానిఫెస్టో తయారవుతుందని ఆయన తెలిపారు. వేరొకరు చేయలేనివి కాంగ్రెస్ చేయగలిగినవి ఏపి పునర్నిర్మాణంలో ఉంటాయని మాజీ కేంద్ర మంత్రి జెడి శీలం చెప్పారు. మ్యానిఫెస్టో తయారీ మాత్రమే కాకుండా డిక్లరేషన్, గ్యారంటీలు కూడా ఉంటాయని సిడబ్ల్యుసి సభ్యుడు కొప్పుల రాజు అన్నారు.
- కాసుల ప్రతాపరెడ్డి
No comments:
Post a Comment