Friday, December 15, 2023

పవన్‌ కల్యాణ్‌ను వదిలేసిన బిజెపి: ఇక కేసీఆర్‌కు బిజెపి చుక్కలే - BJP parts away from Pawan Kalyan in Telangana, Why?

 పవన్‌ కల్యాణ్‌ను వదిలేసిన బిజెపి: ఇక కేసీఆర్‌కు బిజెపి చుక్కలే


మన అవసరం ఉందని అనుకుని మనతో బిజెపి (BJP) తెలంగాణలో పొత్తు పెట్టుకుందని, బిజెపి నేతలు వాళ్లంతట వాళ్లే వచ్చి పొత్తు పెట్టుకున్నారని జనసేన (Jana Sena) అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ శ్రేణులతో చెప్పారు. ఇప్పుడు బిజెపి పవన్‌ కల్యాణ్‌ అవసరం లేదని భావిస్తున్నట్టుంది. పవన్‌ కల్యాణ్‌ను వదిలేసింది. తెలంగాణలో జనసేనతో పొత్తు ఉండదని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు (Telangana BJP), కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి (Kishan Reddy) తేల్చేశారు. తెలంగాణలో పవన్‌ కల్యాణ్‌ ద్వారా నెరవేర్చాలకున్న బిజెపి లక్ష్యం దెబ్బ తిన్నది. కాంగ్రెస్‌ తమకు ప్రథమ రాజకీయ శత్రువు కాబట్టి కేసీఆర్‌ (KCR) నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌ (BRS) తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో (Telangana Assembly Elections 2023) గెలిస్తే మంచిదని బిజెపి భావించింది. అందుకు పవన్‌ కల్యాణ్‌ను కూడా వాడుకుంది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు 8 చోట్ల పోటీ చేశారు. వారికి నామమాత్రం ఓట్లు కూడా పడలేదు. బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా జనసేన అభ్యర్థులకు తెలంగాణలో రాలేదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి (AP CM), వైఎస్సార్‌ కాంగ్రెస్‌ (YSR Congress) పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ (YS Jagan) ఎగతాళి చేశారు. 



తెలంగాణలో తమ పార్టీ అభ్యర్థులకు తగినన్ని ఓట్లు రాకపోయినా పవన్‌ కల్యాణ్‌ నష్టపోయేదేమీ లేదు. కానీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మాత్రం ఆయన సత్తా చాటాల్సే ఉంటుంది. అందుకు ఆయన నారా చంద్రబాబు నాయుడి (Nara Chandrababu Naidu) నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ (TDP)తో పొత్తు పెట్టుకున్నారు. బిజెపి ఆ రెండు పార్టీలతో కలిసి నడుస్తుందా, లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. కానీ బిజెపిని తనతో తీసుకుని వస్తానని పవన్‌ కల్యాణ్‌ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను కాస్తా పక్కకు నెట్టి తెలంగాణ రాజకీయాలకు వద్దాం.

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ (Telangana Congress) ప్రభుత్వం పూర్తి కాలం మనుగడ సాగించలేదని, కేసీఆర్‌ కొద్ది నెలల్లోనే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని బీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. ప్రచారం చేయడమే కాదు, ఆ విషయాన్ని నమ్ముతున్నాయి. అయితే, ఆ పరిస్థితి వస్తుందా అనే పెద్ద ప్రశ్న. ప్రశ్న మాత్రమే కాదు, సందేహం కూడా. బిజెపి ఆలోచన మరో విధంగా ఉన్నట్లు కనిపిస్తున్నది. పవన్‌ కల్యాణ్‌తో తెలంగాణలో పొత్తు ఉండదని కిషన్‌ రెడ్డి ప్రకటించడంతోనే బిజెపి వ్యూహం ఏమిటో అర్థమవుతున్నది. కాంగ్రెస్‌ను తెలంగాణలో నిలువరించలేకపోయిన బిజెపి వచ్చే లోకసభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసుకున్నట్లు అనిపిస్తున్నది.

లోకసభ ఎన్నికల్లో పోటీ తమకు, కాంగ్రెస్‌కు మాత్రమే ఉండేలా వ్యూహరచన చేస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌ను వెనక్కి నెట్టి ముందుకు రావడం ఆ వ్యూహంగా చెప్పవచ్చు. కేసీఆర్‌ తిరిగి అధికారంలోకి వస్తారని భావిస్తున్న బీఆర్‌ఎస్‌కు బిజెపి చుక్కలు చూపించవచ్చు. లోకసభ ఎన్నికలు జాతీయ అంశాల మీద ఆధారపడి జరుగుతాయి. జాతీయ నాయకత్వాలనే ఓటర్లు చూస్తారు. అధికారంలో వుంటే వేరు గానీ, అధికారం కోల్పోయిన తర్వాత జాతీయ రాజకీయాలపై ప్రాంతీయ పార్టీలు ప్రభావం చూపడం కష్టం. దానివల్ల కేసీఆర్‌ తిరిగి పుంజుకుని బీఆర్‌ఎస్‌కు జవజీవాలు పోసి లోకసభ ఎన్నికల్లో సత్తా చాటుతారని అనుకోలేం. గత లోకసభ ఎన్నికల్లోనే బీఆర్‌ఎస్‌ దెబ్బ తిన్నది. అధికారంలో ఉన్నప్పటికీ కొన్ని సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. అధికారంలో లేని ప్రస్తుత తరుణంలో లోకసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నెగ్గుకు రావడం కత్తి మీద సామే అవుతుంది.



ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బిజెపి కాంగ్రెస్‌ను తెలంగాణలో ఎదుర్కోవడానికి, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం తామే అనిపించుకోవడానికి బీఆర్‌ఎస్‌ దెబ్బ తీసినా ఆశ్చర్యం లేదు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి బిజెపి ఊపు మీద ఉంది. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి బిజెపి పావులు కదుపుతున్నది. కాంగ్రెస్‌ నాయకత్వంలోని ఇండియా (INDIA) కూటమి ఎన్నికలకు అంతగా సిద్ధపడినట్లు లేదు. ఉత్తరాదిన తమకు సత్తా చాటుతామని బిజెపి నాయకత్వం విశ్వాసంతో ఉన్నప్పటికీ దక్షిణాది అంత సానుకూలంగా లేదు. కర్ణాటక (karnataka)లో అధికారాన్ని కోల్పోయింది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఎదుర్కుని అత్యధికంగా లోకసభ సీట్లు సాధిస్తామనే నమ్మకం లేదు. దాంతో తెలంగాణపై బీజెపి దృష్టి పడిరది. కేసీఆర్‌ను వెనక్కి నెట్టడం ద్వారా లేదా బీఆర్‌ఎస్‌ను దెబ్బ తీయడం ద్వారా తన లక్ష్యాన్ని సాధించుకునే దిశగా బిజెపి కదలికలు ఉంటాయి. 

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కూడా అనూహ్యంగా బిజెపి శాసనసభ స్థానాలను సాధించింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పాగా వేసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మూడు సీట్లు గెలుచుకుంది. కామారెడ్డిలో కేసీఆర్‌పై బిజెపి అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి (Katipalli Venkataramana Reddy) విజయం సాధించారు. మరింతగా బిజెపి తెలంగాణలో పుంజుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తుందని అనుకోవచ్చు. అందులో భాగంగానే పవన్‌ కల్యాణ్‌తో తెలంగాణలో పొత్తు ఉండదని కిషన్‌ రెడ్డి భావించి వుండవచ్చు. తెలంగాణ సెంటిమెంటు (Telangana Sentiment) ప్రచారం కాకుండా చూడడానికే పవన్‌ కల్యాణ్‌ను తెలంగాణలో దూరం చేసుకుంటున్నట్లు భావించవచ్చు. ఏమైనా కేసీఆర్‌కు ఇక గడ్డు కాలమే.

- కాసుల ప్రతాపరెడ్డి

No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...